ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా జపాన్కు చెందిన చిటెట్సు వటనాబె (112) గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. 112 ఏళ్ల వయస్సులో ను ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఫొటో దిగిన ఆయన ఇక లేరు. చిటెట్సు వటనాబె ఆదివారం తుదిశ్వాస విడిచారని .. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు గిన్నీస్ రికార్డ్స్ ప్రతినిధులు వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి జ్వరం, శ్వాసంబంధ సమస్యల కారణంగా వటనాబె ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరు. చిటెట్సు వటనాబేకు ఐదుగురు సంతానం కాగా..12 మనవళ్లు, 17 ముని మనవండ్లు ఉన్నారు.
గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల వివరాల ప్రకారం చిటెట్సు వటనాబె 1907లో ఉత్తరజపాన్లోని నీగటాలో జన్మించాడు. చిటెట్సు వటనాబె అగ్రికల్చర్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత తైవాన్లోని దాయ్-నిప్పన్ మెయిజి షుగర్ కంపెనీలో కాంట్రాక్టు పనుల్లో చేరాడు. చిటెట్సు 18 ఏళ్లుగా తైవాన్లో నివసిస్తున్నాడు. శతాధిక వయస్సులోను ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వటనాబె మృతిపట్ల గిన్నీస్ ప్రతినిధుల బృందం విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.